ప్రతిపక్షం, ఆగస్టు 23: దేశంలో ఆహార ఉత్పత్తుల నాణ్యత, లేబులింగ్ నిబంధనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఇటీవల పలు ప్రముఖ ఆహార, పానీయాల సంస్థల ఉత్పత్తులు, ప్రకటనలు, లేబులింగ్ విధానాలను పరిశీలించిన అధికారులు నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మిస్లీడింగ్ ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్లు, లేబులింగ్ నిబంధనలను పాటించకపోవడం వంటి అంశాలపై 150కిపైగా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉత్పత్తులపై ప్రచారం చేయడం, ప్యాకేజింగ్పై సరైన వివరాలు ఇవ్వకపోవడం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన క్లెయిమ్లలో నిబంధనలు ఉల్లంఘించడం వంటి అంశాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ దృష్టి సారించింది. ప్రముఖ బ్రాండ్లు కూడా నిబంధనలకు లోబడి తమ ఉత్పత్తులను విక్రయించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకున్న సంస్థల జాబితాలో నెస్లే, కోకా కోలా, పెప్సికో, రెడ్బుల్, మాన్స్టర్ ఎనర్జీ, డియాజియో వంటి ప్రముఖ సంస్థలు ఉన్నట్లు వెల్లడైంది. ఆయా సంస్థలకు సంబంధించిన ఉత్పత్తులపై ప్రచారం, లేబులింగ్ విధానం, వినియోగదారులకు అందిస్తున్న సమాచారాన్ని అధికారులు పరిశీలించిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ఆహార ఉత్పత్తులపై ముద్రించే వివరాలు వినియోగదారులకు స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఉత్పత్తి పదార్థాలు, పోషక విలువలు, తయారీ, గడువు తేదీలు, ఇతర ముఖ్యమైన వివరాలను నిబంధనలకు అనుగుణంగా అందించాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు లేదా ఇతర ప్రత్యేక లక్షణాల పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన కొన్ని సంస్థలపై మరింత కఠిన చర్యలు కూడా తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఇందులో భాగంగా అమెజాన్కు చెందిన ఒక గిడ్డంగి లైసెన్స్ను రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే డొమినోస్కు చెందిన ఐదు లైసెన్స్లను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది.
ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆహార తయారీ సంస్థలు, విక్రయ కేంద్రాలు, సరఫరా వ్యవస్థలపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్, పానీయాలు, ఫాస్ట్ఫుడ్, ఆన్లైన్ ద్వారా విక్రయించే ఆహార ఉత్పత్తులపై నిఘాను మరింత పెంచే అవకాశం ఉంది.
వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార సంస్థలు అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉత్పత్తులపై తప్పుడు సమాచారం ఇవ్వడం, మిస్లీడింగ్ ప్రకటనలు చేయడం లేదా తప్పుదోవ పట్టించే ఆరోగ్య క్లెయిమ్లు చేయడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. తాజా నోటీసులు, లైసెన్స్ల రద్దు చర్యలతో ఆహార రంగంలోని సంస్థలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ గట్టి హెచ్చరిక పంపినట్లయింది.





























