ప్రతిపక్షం, ఆగస్టు 22: ఢిల్లీలో ఓ కుటుంబంలో చోటుచేసుకున్న చిన్నపాటి గొడవ చివరకు దారుణ హత్యకు దారితీసింది. బిడ్డకు మందులు ఇచ్చే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో భార్య కుటుంబ సభ్యులు అల్లుడిపై దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. వినయ్, రేఖ దంపతుల మధ్య తమ బిడ్డకు మందులు ఇచ్చే విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేఖ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న ఆమె తండ్రి, బాబాయ్, సోదరులు, వదిన సుమారు 10 నిమిషాల్లోనే ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు వినయ్తో గొడవకు దిగారు. అనంతరం అందరూ కలిసి అతడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వినయ్ గొంతు నులిమడంతో పాటు ఛాతీపై పిడిగుద్దులు కురిపించి, కాళ్లతో తన్నినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వినయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన కుటుంబ సభ్యుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నారు.
మృతుడు వినయ్ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అడోబ్లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయనకు సుమారు రూ.60 లక్షల వార్షిక ప్యాకేజీ ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ జీవితంలో స్థిరపడిన వినయ్ కుటుంబ కలహంతో ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. చిన్నపాటి కుటుంబ వివాదం చివరకు హత్యకు దారితీయడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.





























