Trending Now

మాజీ మంత్రి హరీష్ రావు పేషీలో పనిచేసిన నరేశ్​ అరెస్ట్..

సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు తస్కరంచిన కేసులో..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది. తాజాగా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఫేషీలో కంప్యూటర్​ ఆపరేటర్​గా పనిచేస్తూ, ఆయన పీఏగా ఉన్న నరేష్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్‌మాల్ కేసులో ఈ నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్.. హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన దూమ రవి నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన వారిలో జోగుల నరేష్ కుమార్ సహా కొర్లపాటి వంశీ, వెంకటేష్ గౌడ్, ఓంకార్ ఉన్నారు.

అసలేం జరిగిందంటే..

నవంబర్ 2002లో పొలం పనులు చేస్తుండగా రవి నాయక్ భార్య పాముకాటుకు గురైంది. సంగారెడ్డిలోని ఓ హాస్పిటల్లో రవి నాయక్ తన భార్యకు ప్రాథమిక చికిత్స చేయించాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాడు. అయితే, ఆమె చికిత్స పొందుతూ నవంబర్ 6వ తేదీన చనిపోయింది. అప్పటికే భార్య ఆస్పత్రి ఖర్చుల కోసం సుమారు రూ. 5 లక్షల వరకు రవి నాయక్ ఖర్చు చేశాడు. భార్య మరణానంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అప్లై చేసి నెలలు గడుస్తున్నా.. సీఎం రిలీఫ్ ఫండ్‌పై స్పష్టత రాలేదు. దీంతో రవి నాయక్ సీఎంఓలో సంప్రదించాడు. అప్పుడు అసలు గుట్టు రట్టయ్యింది. రవి నాయక్ భార్య పేరిట సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయిందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. జోగు నరేష్ కుమార్ అనే వ్యక్తి చెక్కులు అందుకున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి.

Spread the love