ప్రతిపక్షం, జూలై 27: భారతీయ కరెన్సీలో త్వరలో పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేపట్టనున్న పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.
ప్రారంభ దశలో ₹10, ₹20 విలువైన నోట్లను 100 కోట్ల చొప్పున ముద్రించేందుకు ఆర్బీఐకి అనుమతి లభించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు.
పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే పాలిమర్ కరెన్సీ నోట్లను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు చిరిగిపోవడం, తడవడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని ఆర్బీఐ ఇప్పటికే వెల్లడించింది.
ఈ కొత్త నోట్లతో కరెన్సీ నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు నోట్ల నాణ్యత, భద్రత కూడా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

















