ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: తమిళనాడులో 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని పదవిపై రాజకీయ చర్చ మొదలైంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2029లో దేశ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని, ఆ ఎన్నికల్లో విజయ్ ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్తో పొత్తు, కూటమి భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి నుంచి బయటకు వస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న హెచ్చరికలపై స్పందించిన కనిమొళి సంతోష్.. రాజకీయాల్లో ఎవరు వస్తారో, ఎవరు వెళ్తారో భవిష్యత్తులో తేలుతుందని అన్నారు.
విజయ్ను తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేది రాహుల్ గాంధీనే అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో విజయ్ను ప్రధాని పదవిలోనూ రాహుల్ గాంధీ కూర్చోబెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి ఆమె వ్యక్తిగత రాజకీయ వ్యాఖ్యలుగానే పరిగణించాల్సి ఉంది.
2029 ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయని టీవీకే నేతలు చెబుతున్న నేపథ్యంలో.. విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ప్రస్తుతం తమిళనాడులోనే ప్రధానంగా రాజకీయ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్న టీవీకే.. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.





























