Trending Now

మూడు పార్టీలదీ ‘డబుల్​ డిజీట్​’..!

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలకు లోక్​సభ ఎన్నికలు భవిష్యత్​ నిర్ణయించేదిగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్​తో పాటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్​ఎస్​, కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీలకు రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీలకు మాత్రం జీవన్నమరణ సమస్యగా మారింది. లోక్​సభ షెడ్యూల్‌ ప్రకటించక ముందే మూడు ప్రధాన పార్టీలు డబుల్​ డిజీట్​ సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా లోక్​సభ ఎన్నికల్లో డబుల్​ డిజీట్​ సాధిస్తేనే అధకార కాంగ్రెస్​పార్టీ పాలనకు బలం చేకూర్చేదిగా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అచీతూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే లోక్​సభ ఎన్నికలు జరుగుతుండం ఆయన పాలనపై పెద్ద ప్రభావం చూపనుంది. దీంతో ఆయన అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, జిల్లాలలో పార్టీల నేతల సమన్వయంపై దృష్ఠిసారించారు. పక్కలో బల్లెంలా బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలను ఎదుర్కొంటూనే డబుల్​ డిజిట్​ సాధన కోసం ఆయన అంతా తానై‌‌ ముందుకు సాగుతున్నారు. అలాగే గత పదేళ్లు రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఎదిగి, గత వంద రోజుల క్రితం అధికారం కోల్పియి ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహిస్తున్న బీఆర్​ఎస్​కు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా డబుల్​ డిజిట్​ సాధిస్తేనే తప్పా రాష్ట్రంలో పార్టీ ఉనికికి ప్రమాదం ఉండదని, ఒకటి, రెండు సాధిస్తే పార్టీ ఉనికికే ప్రమాదంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్​ భావించారు. దీంతో నియోజకవర్గాల వారీగా సీనియర్​ నేతలతో సమావేశాలు నిర్వహస్తున్నారు. అయితే పలు పార్లమెంట్​ నియోజకవర్గంలో సీనియర్​ నేతలుగా ఎదిగి, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీని వీడడం ఆయనకు తలబొప్పి తెప్పిస్తోంది. ఎలాగైనా పార్టీని రాష్ట్రంలో నిలుపుకునేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం ఈ సారి లోక్​సభ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్న అధిక సీట్లు సాధించి, వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అయితే కేంద్రంలోని బీజేపీ ఆగ్రనేతలంతా రాష్ట్ర ఎన్నికలపైనే దృష్టిసారించారు. ఇప్పటికే ఒక దఫా రాష్ట్రంలో పర్యటన సాగంచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అలాగే పార్టీ ట్రుబల్​ షూటర్​ కేంద్ర హోంమంత్రి అమిత్​షా సైతం రాష్ట్రంలో పార్టీ శ్రేణులతో విస్తృత సమావేశాలు నిర్వహంచి లోక్​సభ యుద్దానికి సన్నద్దం చేశారు.

త్రికోణ పోటీ..?

రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్‌ జరగనుంది. ఈ 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో త్రికోణ పోటీ జరిగే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మూడు పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ దుమ్ము రేపుతోంది. సత్తా పే సవాళ్లు పేలుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు టార్గెట్‌గా తెలంగాణ గట్టుపైన డబుల్‌ డిజిట్‌పై బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ దృష్టి సారించాయి.

గతంలో..

2019లో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్‌ 3, బీజేపీ 4, MIM 1 స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మూడు డబుల్‌ డిజిట్‌పై గురి పెట్టాయి. ఇస్‌ బార్‌.. చార్‌ సౌ పార్‌.. మిషన్‌ 400 ప్లస్‌ లక్ష్యంగా కమలదళం వ్యూహాలకు పదను పెడుతోంది .దక్షిణాదిపై ముఖ్యంగా తెలంగాణ మీద బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. గత లోకస్‌భ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 12 సీట్లు బీజేపీ గెలుచుకోవడం ఖాయమని, అందుకు పార్టీ నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగించాలని అమిత్​షా కోరిన విషయం తెలిసిందే!. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడు ఎంపీ స్థానాలు చేజిక్కించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు గెలవాలనేది కాంగ్రెస్‌ టార్గెట్‌. అంటే అదనంగా 11 స్థానాలపై గురి పెట్టింది. అధికారంలో ఉన్న పార్టీ.. అందులోనూ రేవంత్‌ లాంటి నాయకుడు సీఎం సీట్లో ఉన్నసమయంలో అధిష్టానం గట్టి ఆశలు పెట్టుకుంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకుబీఆర్​ఎస్​ సైతం సిద్ధం అవుతోంది. గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​..ఇప్పుడు డబుల్‌ డిజిట్‌ పక్కా అంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్​ఎస్​తో పాటు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయ వేడెక్కిస్తున్నారు.

Spread the love