ప్రతిపక్షం, వనపర్తి ప్రతినిధి, జూలై 30: డబుల్ బెడ్రూం గృహాల కాలనీల్లో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, వారి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) తెలిపారు. గురువారం మదనాపూర్ డబుల్ బెడ్రూం గృహాల కాలనీని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా స్థానికులు కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.పర్యటనలో హౌసింగ్ పీడీ విటోభా, వివిధ శాఖల అధికారులు, స్థానిక సర్పంచ్, కాలనీ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

















