ప్రతిపక్షం, జూన్ 20: మహారాష్ట్ర రాష్ట్రంలోని పర్బానీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యశ్వాడి ప్రాంతంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న మండపం ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీ ప్రమాదం సంభవించింది.
ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో మండపంలో భక్తులు ఉండటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. మరో ఇరవై మంది వరకు శిథిలాల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ప్రజలు, పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

















