ప్రతిపక్షం, ఆగస్టు 15: కాంగ్రెస్లో తనపై వస్తున్న హెచ్చరికలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు తనపై ఫిర్యాదు చేసినా తాను భయపడబోనని స్పష్టం చేశారు.
తనకు హెచ్చరికలు జారీ చేయడం కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. పార్టీలోకి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చేరిన నేతలతో పాటు వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న వారికి కూడా ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇతర పార్టీలకు చెందిన నేతలను పెద్ద ఎత్తున చేర్చుకోవడం విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను చెప్పే హక్కు తనకు ఉందని, అందుకోసం ఎలాంటి హెచ్చరికలకు తాను వెనకడుగు వేయబోనని ఆయన తేల్చిచెప్పారు.





























