ప్రతిపక్షం, జూన్ 25: తుంగభద్ర ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి వనరుల పరిరక్షణే భవిష్యత్ అభివృద్ధికి కీలకమని అన్నారు. నీటి ప్రాజెక్టులను సంరక్షించుకుంటేనే రానున్న తరాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు ప్రశంసించారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సమావేశమవడం చారిత్రాత్మక పరిణామమని అభివర్ణించారు.
దేశంలో నదుల అనుసంధానం అత్యంత అవసరమని పేర్కొన్న చంద్రబాబు, గంగా–కావేరి నదుల అనుసంధానం తన జీవిత లక్ష్యమని చెప్పారు. అది సాధ్యమైతే దేశ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను సమర్థవంతమైన, సానుకూల నాయకుడిగా అభివర్ణించిన చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి చురుకైన నాయకుడని, తెలంగాణ హక్కుల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధపడరని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చూపుతున్న పట్టుదల తనను ఆకట్టుకుందని తెలిపారు.
మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతో జల సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా కలిసి పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తుంగభద్ర వంటి ప్రాజెక్టులు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.

















