ప్రతిపక్షం, జూన్ 26: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ను మానవ వనరుల శాఖకు మార్చే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఎంపీ రాఘవ్ చడ్డాలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మార్పులపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
















