[t4b-ticker]

చండూరు పీహెచ్‌సీ దుస్థితిపై బీఎస్పీ ఫైర్

*వైద్యులు, మందులు లేక ప్రజలు అవస్థలు.
*పీహెచ్‌సీకి తక్షణమే నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలి .
*పీహెచ్‌సీ లో ఖాళీలు భర్తీ చేయండి .లేకుంటే ఆందోళనలు తప్పవు .
*చికిత్స లేక చండూరు ప్రజల పాట్లు . పీహెచ్‌సీ నిర్వాకంపై బీఎస్పీ ఆగ్రహం .

ప్రతి పక్షం చండూరు ఆగస్టు 15: చండూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితిపై బీఎస్పీ తీవ్ర విమర్శలు చేసింది. సుమారు 40 వేల జనాభాకు సేవలందిస్తున్న పీహెచ్‌సీలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉన్నాయని, కనీస మౌలిక వసతులు కూడా లేవని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయితరాజు అభయేందర్ ఆరోపించారు.

నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పీహెచ్‌సీని బీఎస్పీ నాయకులు పరిశీలించారు. మండల అధ్యక్షులు కడారి సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశీలనలో ఆసుపత్రి పరిస్థితులను పరిశీలించిన బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయితరాజు అభయేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సుమారు 40 వేల జనాభాకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉండటం దారుణమని అన్నారు. ఉన్న పడకలు కూడా సౌకర్యవంతంగా లేవని, ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందని ఆరోపించారు.

కిటికీలకు అద్దాలు లేకపోవడం, తలుపులు విరిగిపోయి ఉండటం, అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది, మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.

*అభయేందర్ మాట్లాడుతూ..
“మునుగోడు ప్రజలకు రాజకీయ ప్రసంగాలు కాదు.. మెరుగైన వైద్యం కావాలి. 40 వేల జనాభాకు ఆరు పడకలు ఉండటం ప్రజల ఆరోగ్యంపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్ర రాజకీయాలపై చూపుతున్న శ్రద్ధలో కొంతైనా మునుగోడు విద్య, వైద్య రంగాలపై చూపాలి.”

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు.

చండూరు పీహెచ్‌సీని తక్షణమే అభివృద్ధి చేసి, పడకల సంఖ్యను 100కు పెంచాలని, అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

“మునుగోడు అభివృద్ధి అంటే కేవలం రాజకీయ సమావేశాలు కాదు.. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడం కూడా అభివృద్ధిలో భాగమే” అని అభయేందర్ పేర్కొన్నారు.

మునుగోడు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే పరిశీలించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని బీఎస్పీ తరఫున డిమాండ్ చేశారు.

చండూరు పీహెచ్‌సీకి తక్షణమే నిధులు కేటాయించి మౌలిక వసతులు మెరుగుపరచాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. ప్రజలకు అందుబాటులో ఉండే స్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేయాలని కోరింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ నాయకులు బొట్ట శివ, చండూరు మున్సిపల్ అధ్యక్షురాలు పద్మ, అన్నపాక శంకర్, రుషిపాక మాణిక్యం, మర్రిగూడ మండల అధ్యక్షులు నాగిళ్ల మారయ్య, గట్టుప్పల్ మండల అధ్యక్షులు వినోద్, నారాయణపురం మండల అధ్యక్షులు ఎర్రోళ్ల గిరి, మండల ఉపాధ్యక్షులు గొందిగళ్ల కృష్ణ, నాయకులు రాజు, శేఖర్, నవీన్, శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News