Trending Now

ప్రపంచానికే భారత్​ ‘ఆశాకిరణం’.. పటాన్‎చెరు సభలో ప్రధాని మోదీ

‘ఆర్థిక అభివృద్దిలో దేశం కొత్త అధ్యాయం’

రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాధరణ

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఆర్థికాభివృద్ధిలో భారత్​ కొత్త అధ్యాయం సృష్టించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. మోదీ గ్యారెంటీ అంటే.. మోదీ ఏం చెబితే అది చేసి చూపిస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పటాన్‎చెరులో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు. విదేశాల్లో మనవాళ్లు చాలమంది ఉన్నారు. అందుకు తాను గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్ ను ప్రపంచ దేశాల్లో సరికొత్త శిఖరాలకు చేర్చాలన్నారు. ప్రపంచానికి భారత్ ఒక ఆశాకిరణంగా ఉందన్నారు. దేశ అర్థిక అభివృద్దిలో కొత్త అధ్యయనం లిఖించామన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు.

గతంలో ఇచ్చిన మాట ప్రకారం అర్టికల్ 370 అమలు చేసి చూపించామన్నారు. దీనిపై సినిమా కూడా తీశారన్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు హాయిగా జీవిస్తున్నారని తెలిపారు. నాకైతే దేశమే ముఖ్యం.. కొందరు కుటుంబ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. కుటుంబ వాదం వల్ల దేశానికి తీరని నష్టమని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందన్నారు. కుటుంబ పాలనపై తాను విమర్శలు చేస్తే తనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారన్నారు. నాకు అసలు కుటుంబమే లేదని విమర్శిస్తున్నారని తెలిపారు. కానీ దేశంలోని 140 కోట్ల మంది తన కుటుంబమేనని చెప్పారు. దేశంలో ఒక వర్గం నల్లధనంతో తమకు, తమ కుటుంబ సభ్యులకు మంచి విలాసవంతమైన ఇళ్లు కట్టించారని విమర్శించారు. కానీ మోదీ మాత్రం దేశంలోని నాలుగు కోట్ల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ రీతిలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించామన్నారు. ఇండి కూటమికి ఇది అర్థం కావడంలేదని చురకలంటించారు.

మాటిస్తున్నా.. తెలంగాణ ప్రజలను తలదించుకోనివ్వను..

ఈ వేదికపై నుంచి మాట ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి.. తెలంగాణను అభివృద్ది చేస్తా.. మిమ్మల్ని తలదించుకోనివ్వనని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మీ ప్రేమను నేను ఎప్పటికీ మరువలేనని.. ఇచ్చిన ప్రతి మాటను బీజేపీ సర్కార్ నిలబెట్టుకుంటుందని తెలిపారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్ధిక దేశంగా మనం నిలుస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్దికోసం వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు తీసుకొచ్చామన్నారు. తాను ఇప్పటి వరకు సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని తెలిపారు. తనకు ఇచ్చిన బహుమతులను వేలం వేసి ప్రజలకు సేవలందించడం కోసం వినియోగిస్తున్నానన్నారు. తమ ప్రభుత్వం అందించిన పథకాల్లో ఎక్కువ శాతం లబ్ధి పొందింది మహిళలేనని పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గ అభ్యుదయం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే గూటి పక్షులు అంటూ ఆరోపించారు ప్రధాని మోదీ. రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయంటూ కీలక వ్యాక్యలు చేశారు.

Spread the love