ప్రతిపక్షం, ఆగస్టు 10: తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివాసీ సంప్రదాయాలను గౌరవిస్తూ వారు స్వయంగా గిరిజనుల సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.
ఆదివాసీ సంప్రదాయ వస్త్రధారణలో కలెక్టర్, ఎస్పీ కనిపించడంతో వేడుకలకు వచ్చిన గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన కళాకారులు సంప్రదాయ పాటలు, నృత్యాలతో సందడి చేయగా.. ఉన్నతాధికారులు కూడా వారితో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
గిరిజన కళాకారులతో కలిసి పాటలకు స్టెప్పులు వేస్తూ కలెక్టర్, ఎస్పీ సందడి చేయడం అక్కడి వారిని ఆకట్టుకుంది. సాధారణంగా అధికారిక కార్యక్రమాల్లో కనిపించే ఉన్నతాధికారులు ఇలా తమ సంప్రదాయ దుస్తులు ధరించి తమతో కలిసి నృత్యం చేయడంతో ఆదివాసీ ప్రజలు మరింత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఆదివాసీ సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వారి హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
కాగా, ఆసిఫాబాద్లో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. కలెక్టర్, ఎస్పీ గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యంలో పాల్గొన్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.





























