ప్రతిపక్షం, జూలై 16: హైదరాబాద్ సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థికి మతపరమైన పాఠ్యాంశానికి సంబంధించిన హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. విద్యార్థికి ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చారని ఆరోపిస్తూ కొందరు హిందూ సంఘాల ప్రతినిధులు పాఠశాల వద్ద ఆందోళనకు ప్రయత్నించారు.
స్కూల్ను ముట్టడించేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందడంతో విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలలో తనిఖీలు చేపట్టారు.
విద్యార్థికి మతపరమైన హోంవర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించబోమని స్పష్టం చేసింది.
విద్యార్థి తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ను విద్యాశాఖ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను పాఠశాల యాజమాన్యానికి చూపిస్తూ అధికారులు వివరణ కోరినట్లు సమాచారం. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

















