Trending Now

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం నిబద్దతతో ఉంది..

డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు మంత్రి పొంగిలేటి హామీ

డీజేహెచ్‌ఎస్‌ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిబద్దతతో ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇందుకు సంబంధించిన కార్యాచరణను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం మంత్రి పొంగులేటిని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలోని ఆయన ఇంట్లో డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి డీజేహెచ్‌ఎస్‌ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. డీజేహెచ్‌ఎస్‌ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, అతి త్వరలో అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు.

ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్‌ అధ్యక్షులు బొల్లోజు రవి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని శాలువాతో సత్కరించారు. బొల్లోజు రవి మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం ఒక కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇటీవల కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అప్పుడు సీఎం సానుకూలంగా స్పందించారని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల చిరకాల కోరికైన సొంతిళ్లను సాకారం చేసే విశాల హృదయం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉందని భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజేహెచ్‌ఎస్‌ ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్‌, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు గంగాపురం ప్రతాప్ రెడ్డి, కొత్తకాపు విక్రమ్‌ రెడ్డి, స్వామిరెడ్డి, సభ్యులు శ్రావణి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love