ప్రతిపక్షం, జూన్ 23: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన రుణ సహాయంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
సమావేశంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ, ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయం, భారతీయ రైల్వే ఫైనాన్స్ సంస్థ ద్వారా రుణ మంజూరు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. మెట్రో ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని వివరించగా, కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రైల్వే శాఖతో జరిగిన చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. మెట్రో రుణ వ్యవహారంలో తదుపరి చర్యల కోసం కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మంగళవారం సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతర చర్చలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

















