Trending Now

‘మోడీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలి’.. హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ

ప్రతిపక్షం, హుస్నాబాద్: రైతుల న్యాయపరమైన కోరికలను ఆమోదించకుండా వారిని హింసిస్తున్న ప్రధాని మోదీని గద్దె దించాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు మద్దతుగా హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రోజున సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందుల గురి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారితో చర్చలు జరిపి వారి న్యాయపరమైన కోరికలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

పిసిసి కార్యదర్శి కేడం లింగమూర్తి మాట్లాడుతూ.. రైతులను ఇబ్బంది పెడుతున్న మోడీకి దేశాన్ని పాలించే అర్హత లేదని అన్నారు. మోడీని గద్దెదించడమే తక్షణ కర్తవ్యమని తెలిపారు జేఏసీ కో ఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. కమ్యూనిస్టు నాయకుడు కొయ్యడ కొమురయ్య మాట్లాడుతూ.. రైతులకు వెంటనే మోడీ క్షమాపణ చెప్పాలని లేనిచో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఏసి కో కన్వీనర్ ముక్కెర సంపత్ కుమార్, వడ్డేపల్లి మల్లేశం మిత్రపక్షాల ప్రజా సంఘాల నాయకులు బంక చందు, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, పెరుమాండ్ల నర్సాగౌడ్, వెన్న రాజు, మార్క అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love