Trending Now

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా.. మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ప్రతిపక్షం మార్చి 23: సార్వత్రిక ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భూ నిర్వాసితులతో అన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ భూనిర్వాసితులైన వివాహిత మహిళలు, యువతులు హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారితో కాసేపు మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యల పట్ల తనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన ఉందని, నిర్వాసితులకు రావలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వివాహిత యువతులకు అందాల్సిన నష్టపరిహారం విషయమై ఎన్నికల నియమావళి ముగిశాక తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. అవసరమైతే భూనిర్వాసితులతో కలిసి తాను కూడా పోరాటం చేస్తానన్నారు.

Spread the love