ప్రతిపక్షం, జూన్ 09: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత నెలలో ఆత్మహత్య చేసుకున్న భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త కూడా అదే చోట ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం, స్వప్న అనే మహిళ గత నెలలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న ఆమె భర్త శ్రీకాంత్ (35) ఇటీవల దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీకాంత్, సోమవారం ఆమె ఆత్మహత్య చేసుకున్న అదే ప్రదేశంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
భార్య దశదిన కర్మ పూర్తయిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. వరుసగా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
















