ప్రతిపక్షం, జూన్ 24: గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్లో జరిగిన భేటీలో విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
సుమారు 14 లక్షల మంది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు భారీగా పేరుకుపోయాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఫీజుల చెల్లింపుల కోసం ప్రైవేట్ కళాశాలలు ఒత్తిడి తీసుకువస్తుండటంతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని, పాత విధానంలోనే అమలు చేయాలని కోరారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

















