Trending Now

బీఆర్​ఎస్​ ఢిల్లీలో ధర్నా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: దిల్లీ లిక్కర్​ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం ఉందని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కవితను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారని కావాలంటే అక్కడ ఈడీ కార్యాలయం ముందు ధర్నాలు చేసుకోమని తెలిపారు. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్​లో ధర్నా చేస్తే బీఆర్​ఎస్​ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారని, ఇప్పుడు వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. “ఏపీ అంశాలపై హైదరాబాద్‌లో ధర్నా ఎందుకన్నారు. ఇప్పుడు ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ధర్నా ఎందుకు? దిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు ధర్నాలు చేసుకోండి. ఎవడొస్తాడో రా చూసుకుందాం అని అన్నారు. కవిత అరెస్ట్ తరువాత ఇప్పుడేమో అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు.” గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వల్ల హైదరాబాద్​ ఆందోళనలు జరగడంపై మాజీ మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలు చేశారు. అది ఏపీ రాజకీయ సమస్య అని దానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దీనికి మంత్రి కోమటి రెడ్డి ఇప్పుడు కౌంటర్​ వేశారని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే దిల్లీ పోలీసులు అరెస్టు చేస్తే అక్కడే ధర్నాలు చేసుకోవాలని సూచించారని వారు చెబుతున్నారు. నిన్న కూడా ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్​ ముందురోజు ఈడీ, ఐటీ దాడులు పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు గల్లీలో కొట్టుకుంటారు, దిల్లీలో దోస్తి అవుతారు అని విమర్శించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో లభ్ధి పొందడానికే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Spread the love