ప్రతిపక్షం, ఆగస్టు 09: రాజమండ్రిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రియాంక కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇది సాధారణ హిట్ అండ్ రన్ ఘటన కాదని, ప్రియాంకను హత్య చేసేందుకు ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ నరసింహ కిశోర్ వెల్లడించారు.
ఓ మాల్లో ప్రియాంకకు నిందితులతో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులు కావాలనే ఆమెను కారుతో ఢీకొట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదనే విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ వెల్లడించారు. ప్రియాంక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా, కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.





























