Trending Now

బీజేపీ నేతకు కాంగ్రెస్ నేత మున్షీ లీగల్ నోటీస్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్​ మున్షీ బీజేపీ నేత ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​కు లీగల్​ నోటీసులు పంపారు. కాంగ్రెస్​ నాయకుల నుంచి బెంజ్​ కారు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలకు రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల ఓ ఛానెల్​ డిబేట్​లో పాల్గొన్న ప్రభాకర్​ ఆమెపై ఆరోపణలు చేశారు. దీపాదాస్​ మున్షీ కాంగ్రెస్​ నాయకుల నుంచి బెంజ్​ కారును తీసుకున్నారని డిబేట్​లో పేర్కొన్నారు. ఆ ఆరోపణలపై బీజేపీ నేతకు లీగల్​ నోటీసులు పంపారు. ‘కొందరు కాంగ్రెస్​ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు గానూ బెంజ్​ కారును కానుకగా పొందినట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది దీపాదాస్​ మున్షీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉంది” అని నోటీసులో పేర్కొన్నారు.

దీపాదాస్​ మున్షీ కి కారును కానుకగా ఇచ్చిన వారి పేర్లు కూడా తెలుసునని డిబేట్​లో పేర్కొన్న ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​, వారెవరో రెండు రోజుల్లో చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. రెండు రోజుల్లోపు బీజేపీ నేత ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ చేసిన వ్యాఖ్యలను నిరూపించలేకపోతే నోటీసు అందిన ఏడు రోజుల్లోపు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.10 కోట్ల పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో ప్రభాకర్​పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దీపాదాస్​ మున్షీ తరఫు లాయర్​ నోటీసుల్లో స్పష్టం చేశారు.

క్షమాపణలు చెప్పాల్సిందే..

ఇదిలా ఉండగా ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్​ మున్షీపై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్​ నాయకులు హెచ్చరించారు. ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఇలాంటి నిరాధార సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​ విమర్శించారు.

మరోవైపు ప్రభాకర్​ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్​ గౌడ్​ డిమాండ్​ చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి కాంగ్రెస్​ పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత అప్పటివరకు కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్న మాణిక్​రావు ఠాక్రేను బదిలీపై ఆంధ్రప్రదేశ్​కు పంపించారు. ఆ తర్వాత ఠాక్రే స్థానంలో దీపాదాస్​ మున్షీని ఇంఛార్జీగా ఏఐసీసీ నియమించింది. నియమించి రెండు నెలలు కాకముందే ఆమెపై బీజేపీ నేతలు పదవుల కోసం బెంజ్​ కారు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్​ నేతలు, దీపాదాస్​ మున్షీ ఖండిస్తూ ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​కు లీగల్​ నోటీసులు పంపించారు.

Spread the love