Trending Now

గల్ఫ్ బాధితులకు కేటీఆర్ పరామర్శ..

ప్రతిపక్షం, తెలంగాణ: హత్య కేసులో దుబాయ్‌లో 20 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కృషితో ఇండ్లకు చేరుతున్న సంగ‌తి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు ఇంటికి చేరగా.. గ‌త బుధవారం సిరిసిల్ల అర్బన్‌ మండలం పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45) సొంతూరికి చేరారు.

ఈ నేపథంలో ఎమ్మెల్యే కేటీఆర్ పెద్దూరు గ్రామానికి బుధ‌వారం వెళ్లారు. మ‌ల్లేశం, ర‌విని ప‌రామ‌ర్శించారు కేటీఆర్. కుటుంబ స‌భ్యుల‌తో ముచ్చ‌టించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ కుటుంబ స‌భ్యులంద‌రినీ ఆప్యాయంగా ప‌లుక‌రించ‌డంతో వారు సంతోష‌ప‌డ్డారు. గ‌ల్ఫ్ జైలు నుంచి విడుద‌ల చేయించినందుకు కేటీఆర్‌కు మ‌ల్లేశం, ర‌వితో పాటు వారి కుటుంబ స‌భ్యులు ప్ర‌త్యేక ద‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్‌ సార్‌ సాయంతోనే తాము విడుదలయ్యామ‌ని మ‌ల్లేషం పేర్కొన్నారు. త‌మ విడుద‌ల‌కు రూ. 30 లక్షల దాకా మా కోసం ఖర్చు పెట్టారు. దుబాయ్‌లో న్యాయసేవల కోసం రూ. 13 లక్షలు, ఇతర ఖర్చులు పెట్టి ఇయ్యాల ఇంటి దాకా రప్పిచ్చిండ్రు. త‌మ కుటుంబ స‌భ్యుల‌ను చూడగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. కేటీఆర్‌ సార్‌ దయతోనే వాళ్లను చూస్తున్నం. సార్‌కు రుణపడి ఉంటాం అని మ‌ల్లేశం తెలిపారు.

Spread the love