Trending Now

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

ప్రతిపక్షం, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి పరిశీలించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువును పరిశీలించారు. ఎల్లమ్మ చెరువు విస్తీర్ణం వివరాలను ఇరిగేషన్ డిఇ రాములు తెలియజేయగా.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు ఎస్టిమేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం.. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పరిశీలించారు. అనంతరం ఏయే కోర్సుల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని.. ఎంత మంది విద్యార్థులు ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ బిక్షపతిని అడిగి తెలుసుకున్నారు.

నూతన భవనంలోకి బదిలీ కావడానికి అవసరమైన ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు తదితర చిన్నచిన్న పెండింగ్ పనులను పూర్తి చేయిస్తానని అన్నారు. అనంతరం మెడికల్ కాలేజ్ నిర్మాణానికి హనుమకొండ రూట్ లో గుర్తించిన ముప్పై ఎకరాల భూమిని పరిశీలించారు. కలెక్టర్ వెంట హుస్నాబాద్ తాహసిల్దార్ రవీందర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Spread the love