Trending Now

విద్యుత్ వినియోగంలో తెలంగాణ రికార్డు


15,752 మెగావాట్ల గరిష్ట డిమాండ్ కు చేరిక
వేసవికి ముందే భారీగా పెరిగిన వినియోగం
ఒక్క జనవరిలోనే పది వేల మెగావాట్ల డిమాండ్
పటిష్ట ప్రణాళికల రూపకల్పనలో విద్యుత్ సంస్థలు
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డీసీఎం భట్టి విక్రమార్క

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో,
హైదరాబాద్, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో ఇంకా సమ్మర్ సీజన్ మొదలుకాలేదు. కానీ, అప్పుడే కరెంట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. నిరుడు పీక్‌ సమ్మర్‌లో ఉన్న డిమాండ్ ఈసారి జనవరిలోనే కనిపించింది. దీంతో వేసవిలో విద్యుత్ వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టు ముందస్తు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. దాదాపు 15,752 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో అత్యధిక విద్యుత్ వినియోగం 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదైంది. కానీ, ఈసారి మాత్రం ఒక నెల ముందుగానే పీక్ డిమాండ్‌కు చేరడంతో సమ్మర్‌లో విద్యుత్ వినియోగం ఎలా ఉండబోతున్నదనేది ఉత్కంఠ రేపుతోంది. రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 17 వేల మెగావాట్ల కంటే ఎక్కువ డిమాండ్‌ను తట్టుకునేలా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గడిచిన 13 నెలల వ్యవధిలో రూ.1,000 కోట్ల ఆదా జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఎండలు మండిపోతున్నాయి
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటి నుంచే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. గతంలో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. వ్యవసాయం, పరిశ్రమలు, ఇండ్లు సహా అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం, నమ్మదగిన రీతిలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఈసారి వర్షాలు బాగా పడి పంట దిగుబడి బాగా వచ్చింది. అందుకే వ్యవసాయ విద్యుత్ వినియోగం డిమాండ్ చాలా పెరిగింది. దాంతో పాటు పారిశ్రామిక, గృహ వినియోగంలో కూడా భారీగా వృద్ధి రేటు కనపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ జనవరిలో పది వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడితే, ఒక్క హైదరాబాద్ మహానగరంలోనేఐదు వేల మెగావాట్ల డిమాండ్ ఉంది. మొత్తం కలిపి 15 వేల మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది.

ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం సమీక్ష
యాసంగితో పాటు రానున్న ఎండాకాలంలో డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీ కరెంట్ సప్లయి చేయడంపై తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు దృష్టి సారించాయి. విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ రంగ సంస్థలు ప్రతి15 రోజులకు ఒకసారి రివ్యూలు నిర్వహిస్తున్నాయి. విద్యుత్ మంత్రి అయిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు.

Spread the love

Related News