Trending Now

నేడు మేడారానికి సీఎం రేవంత్..

వనదేవతల దర్శనం కోసం ప్రముఖుల రాక..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.. సమ్మక్క తల్లి వచ్చింది. మేడారం మహా జాతర మూడో రోజుకి చేరుకుంది. శుక్రవారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దర్శించుకోనున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసింది.. రేవంత్‌‌ రెడ్డి 2022లో పీసీసీ ప్రెసిడెంట్‌‌గా మేడారం వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారం జాతరకు వెళ్తున్నారు.

గవర్నర్‌‌ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి. కేంద్ర మంత్రి అర్జున్‌ముండా కూడా వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. జనారణ్యంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ‘అమ్మ వచ్చె.. సమ్మక్క వచ్చె..’ అంటూ తన్మయత్వంలో భక్తులు శిగమూగారు. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఇక జాతరలో మూడోరోజు గద్దెలపైన తల్లులంతా కనిపించడంతో భక్తులు ఆనందానికి అవధులు లేవు.

సమ్మక్కను తెచ్చే దారిపొడువునా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. గద్దెలపైకి వస్తున్న తల్లిపై పసుపు, కుంకుమలతో పాటు ఒడిబియ్యం చల్లుతూ తమను చల్లగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. నాలుగురోజుల మేడారం మహాజాతరలో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెల మీదికి చేరుకున్నారు. రెండోరోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క కూడా వచ్చి కొలువుదీరింది. దీంతో మిగితా రెండురోజులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. రెండో రోజు గురువారం సాయంత్రం వరకు 60 లక్షల మంది భక్తుల వచ్చారని అధికారులు చెబుతున్నారు.

Spread the love