ప్రతిపక్షం, జూన్ 03: తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్రంగా ఖండించారు. తెలంగాణ గడ్డ తమ పూర్వీకులదని, నేడు తమదని, రేపు భావితరాలదని స్పష్టం చేశారు.
నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్ కళ్యాణ్ను గౌరవిస్తామని చెప్పిన ఆమె, తెలంగాణ రాష్ట్రం డబ్బులు పంచి గానీ, ఒత్తిళ్లతో గానీ సాధించలేదని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల ఆత్మగౌరవం కోసం సాగిన ఉద్యమ ఫలితమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కుటుంబాలు త్యాగాలు చేశాయని, అనేక మంది యువకులు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భావం వెనుక ఉన్న త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని వెన్నెల కోరారు.

















