ప్రతిపక్షం, జూలై 07: ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక శివాలయానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నం (నేషనల్ మాన్యుమెంట్) హోదా కల్పించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలయ పరిధిని జాతీయ సంపదగా ప్రకటించడంతో దాని పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందనున్నాయి. పురావస్తు, వారసత్వ విలువలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జాతీయ హోదాతో ఆలయ సంరక్షణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా అవకాశం ఏర్పడింది. ఇదే పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయం ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ తాజా గుర్తింపుతో ములుగు జిల్లా వారసత్వ పర్యాటకానికి మరింత ప్రాధాన్యం లభించనుంది.
















