Trending Now

వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..

జిల్లా ఆరోగ్య శాఖా అధికారి డా. పుప్పాల శ్రీధర్

ప్రతిపక్షం, జగిత్యాల, ఏప్రిల్ 25: వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖా అధికారి డా. పుప్పాల్ శ్రీధర్ అధికారులకు సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవమం -2024 సందర్భంగా గురువారం స్థానిక మోతేవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం, పట్టణ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సిబ్బందితో కలిసి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోతేవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. దోమ కాటు ద్వారా మలేరియా, డెంగూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు వచ్చి సామాజికంగా ఆర్థికంగా ప్రాణనష్టం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్నిశాఖల వారు కలిసి కట్టుగా పని చేసి దోమలను నివారించాలని కోరారు.

జిల్లావ్యాప్తంగా కీటక జనిత వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటా సర్వే ద్వారా బాధితులను గుర్తించి రక్త నమోనాలు సేకరించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలో కేసులు ఎక్కువగా గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గడిచిన రెండేళ్ల కాలంలో మలేరియా బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారం రోజుల నిల్వ వున్న నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి, కాబట్టి ప్రతి ఒక్కరు ఇండ్ల ఆవరణలో, చుట్టుప్రక్కల ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి. ఈ భాద్యత పూర్తిగా ప్రజలదే అని తెలిపారు.

ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రై డే పాటించి నీటి నిల్వలు అన్నింటిని శుభ్రపరచి ఆరబెట్టి తిరిగి నింపుకోవాలని, నిలువ వున్న మురుగు నీటి గుంతల్లో కిరోసిన్ లేదా వాడిన ఆయిల్ గాని చల్లడం ద్వారా లార్వా దశలో ఉన్న క్రిమికీటకాలను నివారించొచ్చన్నారు. ఓవర్హెడ్ ట్యాంకులపై మూతలు పెట్టవలెను మరియు పనికిరాని వస్తువులు వాడిన టైర్లు, కోబ్బరి బోండాలు, రోల్లు, కూలర్లు, సీసాలు మొదలగు వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. దోమలు కుట్టకుండా కిటికీలకు, బయట తలుపులకు దోమలు రాకుండా మెష్ ఏర్పాటు చేసుకోవలెను. వ్యక్తిగత రక్షణకు, కాయిల్స్ వాడాలి. శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే వస్త్రాలను వాడాలి. ఇంటి బయటగాని, లోపల నిద్రించునప్పుడు తప్పని సరిగా దోమతెరలు వాడవలెనని తెలిపారు.

దోమల నివారణ ప్రతి ఒక్కరి బాద్యత అని, ప్రతి కుటుంబం వారి వారి పరిధిలో దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి లోపల మరియు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడేగా పాటిస్తే ఇంటి లోపలగాని, ఇంటి పరిసరాలలో గాని దోమలు తయారు కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం వలన దోమల అభివృద్ధిని పూర్తిగా నివారించ వచ్చునని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి, వైద్యధికారులు డా. స్వాతి, డా. సంతోష్, డా. చైతన్య రాణి,జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యనారాయణ, సబ్ యూనిట్ అధికారి శ్రీధర్, సుపర్వైజర్లు మురళి, శ్యాం, వేణుగోపాల్, మధుకర్, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News