ప్రతిపక్షం, జూన్ 06: తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాలు, ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితంగా ఏర్పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.
మీడియాతో మాట్లాడిన ఆమె, తెలంగాణ ఈ నేల ప్రజల సొత్తని, ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు.
గతంలో తెలంగాణ వనరులు, ఉద్యోగాలు, నీటి హక్కులు, సంస్కృతి విషయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం వేలాది మంది ఉద్యమించారని తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.















