ప్రతిపక్షం, జూలై 17: పార్టీ కార్యక్రమాల్లో నేతల ఫొటోలకు పాలాభిషేకం, జలాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆదేశించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
పార్టీ కార్యకర్తలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని టీపీసీసీ స్పష్టం చేసింది. ఆహార పదార్థాలను వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని పేర్కొంది. పాలు, ఇతర ఆహార పదార్థాలను నేతల ఫొటోలకు వినియోగించకుండా అవసరమైన వారికి పంపిణీ చేయాలని సూచించింది.
అలాగే నేతలకు జేసీబీలతో భారీ గజమాలలు వేయడం వంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది. పార్టీ కార్యక్రమాల్లో ఆడంబరాలకు తావులేకుండా ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని టీపీసీసీ సూచించింది.

















