Trending Now

బీఆర్​ఎస్​వి దిక్కుమాలిన విధానాలు : సీఎం రేవంత్​

హైదరాబాద్ , ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: పదేళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన విధానాలతో చేసిన పాలన వల్ల ప్రజలు నష్టపోయారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకుని రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును పక్కన పెట్టిందని మండిపడ్డారు. గురువారం నాడు సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు. భూముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేసిందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తక్షణమే తాము అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా..

ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం కూడా తమకు సహకరించిందని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి పనిని చేశారా? అని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలని అన్నారు. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగానని.. రాజకీయాల కోసం కాదని చెప్పారు. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే అని తెలిపారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారంగా నిలుస్తుందని తెలిపారు. అభివృద్ధి కోసం భవిష్యత్‌లోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని.. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామని అన్నారు. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలని.. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

కేటీఆర్​ అమరణదీక్ష చేయాలి..

తమ పోరాటం ఫలించిందని మాజీమంత్రి కేటీఆర్ అంటున్నారు.. ఆయన ఏం పోరాటం చేశారని ప్రశ్నించారు. X(ట్విట్టర్‌)లో వ్యంగంగా పోస్టులు పెట్టుడు తప్పితే ఆయన చేసిందేమిలేదని ధ్వజమెత్తారు. తాము కేంద్రం నుంచి అనుమతులు తీసుకొస్తే కేటీఆర్ పోరాటం చేశారని చెప్పుకుంటున్నారని విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Spread the love