Trending Now

రేవంత్​ ఏమైంది..! కలుద్దామంటే అపాయింట్​మెంట్​ లేదు

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు సంచలన కామెంట్స్

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేవంత్​రెడ్డి బాగానే ఉన్నాడని, గత నెల రోజుల నుంచి ఏమైందో ఏమో కాని ఎవరికి కూడా దొరకడం లేదని సీనియర్​ కాంగ్రెస్​నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పీడ పోయిందని ఒకప్పుడు అన్న సీఎం రేవంత్.. ఇప్పుడు ఏం మాట్లాడటంలేదని వీహెచ్ అన్నారు. ఈ విషయంపై రేవంత్‌ను కలిసి చెబుతామంటే తనకు టైమ్ ఇవ్వడం లేదని అన్నారు. తక్కువ సమయంలో సీఎం అయింది రేవంత్.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోకు! అని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఓ వైపు.. అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. మరోవైపు సలహాలు, సూచనలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ మరీ మీడియా ముందుకొచ్చారు వీహెచ్. ఇంతకీ రేవంత్ గురించి వీహెచ్ ఏమన్నారు..? పదే పదే ఈ ఇద్దరి మధ్య పొరపచ్చాలు వస్తున్నాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ ఒకింత అసంతృప్తి వెలిబుచ్చారు. బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారన్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్ క్యాడర్‌కు న్యాయం చేయకుండా.. కార్యకర్తలపై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా డబ్బు సంపాదించి ఇప్పుడు అధికారంలో ఉన్నామని కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో పనిచేసిన చాలా మంది నేతలు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో కారెక్కి.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేతలను దృష్టిలో పెట్టుకుని వీహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకుండా రెండు సైడ్స్ వినాలని కోరుతున్నా. పార్టీ కార్యకర్తలలకు అన్యాయo చేయకండి. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది త‌న‌ ఆవేదన అని వీ హ‌నుమంత‌రావు స్పష్టం చేశారు.

Spread the love