ప్రతిపక్షం, జూన్ 10: పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నటుడు-దర్శకుడు భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన భారతీరాజా, దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక శైలిని సృష్టించిన భారతీరాజా, వివిధ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించి భారతీయ సినీ పరిశ్రమకు విశిష్ట సేవలందించారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన చిత్రాలు తరతరాల సినీ అభిమానులను ప్రభావితం చేశాయని గుర్తుచేశారు.
భారతీరాజా మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
















