ప్రతిపక్షం, జూలై 17: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను మెదక్ జిల్లాకు చెందిన రాములు (60), రషీద్ (40)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనం, పరారైన డ్రైవర్ కోసం దర్యాప్తు చేపట్టారు.

















