విద్యార్థిగా మారిన కలెక్టరమ్మ

  • మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
  • ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఈఎంఆర్ఎస్ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ తనిఖీ

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ /ఎల్లారెడ్డిపేట,జూన్ 29: నిత్యం విధి నిర్వహణలో బిజీ బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విద్యార్థులకు బోధన చేస్తున్న తీరును వారితో కలిసి కూర్చుని పరిశీలిస్తూ.. పాఠ్యాంశం విన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పాఠ్యాంశం ఉపాధ్యాయుడు బోధిస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో కలిసి బెంచి పై కూర్చున్నారు. పాఠ్యాంశం బోధనను స్వయంగా పరిశీలించారు. పూర్తి అయిన తర్వాత దానిపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం డైనింగ్ హాల్ కు వెళ్లి విద్యార్థులు భోజనం చేస్తుండగా.. ముందుగా మెనూ పరిశీలించి.. సిద్ధం చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం ప్రతి రోజు భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్ధి ప్రణాళిక ప్రకారం చదవాలని, ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్గి. చదువులో రాణించి.. తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు.లైబ్రరీ లో పుస్తకాలతోపాటు దిన పత్రికలు చదవాలని తెలిపారు. దీంతో అన్ని విషయాలపై అవగాహన వస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు. పరిశీలనలో ప్రిన్సిపాల్ ఫాతిమా, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News