హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 08: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. లోయర్ ట్యాంక్బండ్లో నిర్మాణంలో ఉన్న అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించిందని, అందులో తొలి విడతగా రూ.50 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పది అంతస్తుల భవనంగా దీనిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఈ కేంద్రంలో డిజిటల్ లైబ్రరీ, శిక్షణ తరగతులు, సెమినార్లు, పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఆధునిక విజ్ఞానాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించడమే లక్ష్యమని వివరించారు.
అలాగే నింబోలి అడ్డలోని ఎస్సీ హాస్టల్ను ఆధునికీకరించి, దానికి బాబూ జగ్జీవన్ రామ్ భవన్గా నామకరణం చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన అన్నారు.

















