ప్రతిపక్షం, జూలై 17: పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఉపయోగించే రథాల నిర్మాణం ప్రత్యేకమైనది. రథాల తయారీకి ఫాసి, ధౌరా, అసన సహా 10 నుంచి 12 రకాల చెక్కలను వినియోగిస్తారు. ఈ రథాల నిర్మాణంలో తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ‘మహారాణా సేవకులు’ అనే వారసత్వ కుటుంబాలకు చెందిన నైపుణ్యం కలిగిన వడ్రంగులు కీలక పాత్ర పోషిస్తారు.
సుమారు 150 నుంచి 200 మంది వడ్రంగులు దాదాపు రెండు నెలల పాటు శ్రమించి రథాలను నిర్మిస్తారు. ఈ నిర్మాణంలో ఎక్కడా మేకులు ఉపయోగించకపోవడం విశేషం. చెక్కలను ప్రత్యేక పద్ధతిలో సహజంగా ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ చేసే విధంగా అమర్చి రథాలను తయారు చేస్తారు.
రథయాత్ర పూర్తయిన అనంతరం రథాలను విడదీసి, అందులోని చెక్కలను జగన్నాథుడి ప్రసాదం తయారీకి వినియోగిస్తారు. ప్రతి ఏడాది కొత్త రథాలను నిర్మించడం పూరీ జగన్నాథుడి రథయాత్రలో కొనసాగుతున్న ప్రత్యేక సంప్రదాయం.

















