ప్రతిపక్షం, జూలై 16: ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యత, ఆధ్యాత్మిక విశ్వాసాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
బోనాలు కేవలం ఓ పండుగ మాత్రమే కాదని.. హైదరాబాద్ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవన విధానంలో అంతర్భాగమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ ఉత్సవం ప్రజలను భక్తి, ఐక్యతతో ఒక్కతాటిపైకి తీసుకువస్తుందని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 వేలకుపైగా ఆలయాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఎం వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు కేటాయించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగే ఈ ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.


















