ప్రతిపక్షం, జూన్ 27: తెలంగాణలో జూలై 1న కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్ సీఎస్ల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అధికారుల పనితీరుపై సిద్ధమైన నివేదికలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రానున్న రెండున్నరేళ్ల పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ‘డ్రీమ్ టీమ్’ను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భావిస్తున్న కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

















