Trending Now

‘బండి’ యాత్రపై దాడికి యత్నం..

బొమ్మనపల్లిలో ఉద్రిక్తత

ప్రతిపక్షం, తెలంగాణ: హుస్నాబాద్ లో బండి సంజయ్ ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నంచడం కలకలం రేపింది. కాంగ్రెస్ నేతలు కర్రలు పట్టుకుని ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యాత్ర వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా నిలువరించారు. కాంగ్రెస్ తీరుపై బీజేపీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నేతలు కర్రలతో వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ మండిపడ్డారు.


హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి బీజేపీ నేతలను సైతం ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ,అభ్యర్ధి బొమ్మ శ్రీరాం చక్రవర్తిని ప్రజాహిత యాత్ర క్యాంపుకు వెళ్లకుండా నిలిపేశారు. దీంతో తమ పార్టీ నాయకుడిని కలిసేందుకు వెళుతుంటే. అడ్డుకోవడమేంటని బొమ్మ శ్రీరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున బీజేపీ నేతలను కూడా ప్రజాహిత క్యాంపువైపు వెళ్లనిచ్చేది లేదని పోలీసులు తెగేసి చెబుతున్నారు.

బండి సంజయ్ ఆగ్రహం..

కాంగ్రెస్ నేతల తీరుపై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మరోవైపు, ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలియడంతో బీజేపీ శ్రేణులు బండి సంజయ్ కు మద్దతుగా యాత్ర వద్దకు భారీగా తరలివస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం బొమ్మనపల్లి నుండి మంగళవారం రెండోరోజు ప్రజాహిత యాత్రకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. యాత్రను పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు.

బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సహా అందరినీ అడ్డుకుని ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా గంట సేపటి నుండి పోలీసులు నిలువరించారు. బొమ్మ సహా బీజేపీ కార్యకర్తలను యాత్రకు అనుమతించాలని బండి సంజయ్ పోలీసులను కోరారు. లేదంటే తానే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు రావాల్సి వుంటుందని హెచ్చరించారు.

Spread the love