Trending Now

ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో 25 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు బాండ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే కొత్త బస్సులతో ఆర్టీసీకి కొత్త కళ తీసుకువచ్చాం.. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థ భవిష్యత్తులో లాభాల బాటలోకి వచ్చే విధంగా అడుగులు వేయడం గర్వకారణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులు కార్మికులు జీతాల కోసం బాధపడటం.. ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బులు ఆర్టిసికి రాకపోవడం వల్ల ఇబ్బందులు పడటం చూసామని ఆయన గుర్తు చేశారు.

సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థలో 45 వేల మంది ఉద్యోగులు, ఆర్టీసీ సంస్థలో 44 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సింగరేణిని, ఆర్టీసీని కాపాడుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత గా భావిస్తున్నదని పేర్కొన్నారు. లక్షల మందికి రవాణా కల్పిస్తున్న ఆర్టీసీ తెలంగాణకు తలమానికమని.. ఆర్టీసీ సంస్థను ప్రైవేటు చేయమని.. ఆర్టీసీ ఆస్తులు అమ్మం, ఆర్టీసీని నష్టాల్లో ఉంచం, ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అనేక వాగ్దానాలు ఇచ్చిన బిఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి విస్మరించిందని బీఆర్ఎస్ పై ఫైరయ్యారు.

Spread the love