Trending Now

టచ్ చేసి చూడు

సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఛాలెంజ్

(ప్రతిపక్షం స్టేట్ బ్యూరో)

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ‘నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను …నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు… నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది.. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నం… దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కు పోడు… ఉడుత బెదిరింపులకు భయపడను… ముందు ముందు ఏందో చూద్దాం… తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు’’ అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు కేంద్రం ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం కృష్ణా పరీవాహక ప్రాంతం నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని అన్నారు.

ఆనాడే చెప్పిన…

‘ప్రాజెక్ట్‌లు తమకు అప్పగించాలని, లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ నన్ను బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో, నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా. తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని’ ఆనాడే చెప్పిన అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను ఎదిరించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితులలోనూ కేంద్రం చేతికి చిక్కనివ్వబోమన్నారు. అవసరమైతే ఇందుకోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తీరుతామని తేల్చి చెప్పారు.

Spread the love