Trending Now

‘మా అమ్మను కలిసేందుకు అనుమతించండి’.. కోర్టుకు ఎమ్మెల్సీ కవిత అభ్యర్థన

న్యూఢిల్లీ, ప్రతిపక్షం ప్రతినిధి: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఈడీ కష్టడిలో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు తనయ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ‘‘మా అమ్మను కలిసేందుకు అనుమతించండి’’ అంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. తల్లితో పాటు కుమారులను కలుసుకునేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కవిత అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య.. సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత.. సోదరుడు ప్రశాంత్ రెడ్డిలను కలుసుకునేందుకు న్యాయస్థానాన్ని కవిత అనుమతి కోరారు. ఈ క్రమంలో తల్లీ, కుమారులు, కుటుంబసభ్యులను కలిసేందుకు కవితను న్యాయస్థానం అనుమతించింది.

అయితే.. ఈడీ కస్టడీకి అనుమతించిన శనివారం రోజు భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, కజిన్ బ్రదర్స్ పి. శ్రీధర్, ప్రణీత్ కుమార్, పీఏ శరత్ చంద్రలను కలుసుకునేందుకు కోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. కస్టడీలో ఉన్న ఏడు రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య బంధువులను కలుసుకునేందుకు కవితకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్కువ మందిని కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని ఈరోజు కవిత తాజా పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ముందుగా అనుమతించిన వారిలో కేటీఆర్ పేరుతో పాటు తల్లి, కుమారులు, సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డి కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆ మేరకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

సుప్రీంలో పిటిషన్..

ఢిల్లీ మద్యం కేసు లో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కవిత సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్ట్‌ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని కవిత తరఫున న్యాయవాది ఆన్‌లైన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే!

Spread the love