హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారంలో సైతం అధికార కాంగ్రెస్పార్టీ ముందజలో ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమవగా సీఎం రేవంత్ మాత్రం అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికలకు సర్వం సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ అభ్యర్థిని స్వయంగా ఆయనే ప్రకటించారు. దీనితో పాటు మరో ఆరు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తి అయ్యిందని త్వరలోనే వారి పేర్లను సైతం ప్రకటించనున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. ఈనెల 6న మహబూబ్నగర్లో ప్రజా దీవెన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలో సీఎం రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు.
ఈ మేరకు శనివారంనాడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్తో పాటు మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి ముదిరాజ్, జి.మధుసూధన్రెడ్డి, అనిరుద్రెడ్డి, ఎన్నెం శ్రీనివాస్రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు సీఎంను కలిసి ఆహ్వానించారు. అయితే మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్కు అనుకూల వాతావరణం కనిపిస్తోంది.
ఇటీవల సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయడంతో కొడంగల్, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీడుభూములు సాగులోకి రానున్నాయి. ఈ పథకం శంఖుస్థాపన చేయడంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించనున్నట్లు నేతలు భావిస్తున్నారు. అయితే ఇదే నియోజకవర్గం పరిధిలోని షాద్నగర్, మహబూబ్నగర్, జడ్చర్లలో అధికార కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.