ప్రతిపక్షం, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా వాహనాల తనిఖీలు, అనుమానిత వ్యక్తుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాల రాకెట్ను సైబరాబాద్ SOT పోలీసులు ఛేదించారు. 3 లైవ్ రౌండ్లతో పాటు ఒక పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని అయోధ్యనగర్, చింతల్ లో గత రాత్రి ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువకుడు యాక్టివా వాహనంపై రావడంతో అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో.. అతడిని ఆపి సోదాలు చేయగా.. అతని వద్ద మూడు బుల్లెట్ల తో కూడిన ఒక కంట్రీ మేడ్ పిస్టల్ లభ్యమైంది. దీంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా తన పేరు గుడ్డి వంశీ కృష్ణగౌడ్ అని, జీడిమెట్ల కుతుబుల్లాపూర్ అయోధ్యనగర్ కు చెందినవాడని వెల్లడించారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఒక విశాల్ యాదవ్ (గన్ రన్నర్) గత సంవత్సరం ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. గత సంవత్సరం నుండి ఫోన్ లలో అనేక సంభాషణల తర్వాత.. తాను ఆయుధాలు సరఫరా చేస్తుంట్టానని, మీకు ఆసక్తి ఉంటే పిస్టల్స్ సరఫరా చేస్తానని, హైదరాబాద్ లో ఆయుధాలు అమ్మడం ద్వారా భారీగా డబ్బు సంపాదించ వచ్చని విశాల్ యాదవ్ వెల్లడించాడు.
వంశీ ఆయుధాల వ్యాపారం ప్రారంభించడానికి అంగీకరించి ఒక పిస్టల్ (ధర రూ. 50,000) కోసం గత నెలలో ఫోన్ పే ద్వారా రూ. 19,000/- చెల్లించాడు. విశాల్ మార్చి 6 న వరంగల్ ఖాజీపేటకు వచ్చి పిస్టల్ తీసుకుని వచ్చానని వంశీకి చెప్పాడు. వంశీ ఖాజీపేట తన యాక్టివా వాహనం పై వెళ్లి విశాల్ ను కలిసి రూ. 30,000/- నగదు ను విశాల్ కు చెల్లించి 3 లైవ్ రౌండ్ల తో కూడిన పిస్టల్ తీసుకుని కుతుబుల్లాపూర్ కు తిరిగి వచ్చాడు. అతను గత ఒక నెల రోజులనుండి (ధర 2 లక్షలు, ప్రతి తూట 8 వేలకు) నగరంలో కొనుగోలుదారుల కోసం (స్థానిక సంఘ వ్యతిరేకులు, ల్యాండ్ గ్రాబర్స్ లేదా గుండాలు) వెతుకుతున్నాడు. అందులో భాగంగానే నిన్న రాత్రి ఆయుధంతో బయటికి వచ్చి యాక్టివా బైక్ పై బాలానగర్ వైపు వెళ్తూ మార్గమధ్యలో చింతల్ వద్ద SOTపోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాడు. అలాగే ఇంతకు ముందు ఎవరికైనా ఆయుధాలు విక్రయించారా అనే కోణం లో కూడా పోలీసులు విచారిస్తున్నారు.