Trending Now

13 లోక్​సభ సీట్లపై కాంగ్రెస్​ క్లారిటీ..

ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి

త్వరలోనే పార్టీ అభ్యర్థుల ప్రకటన

జాక్​పాట్​ కొట్టిన బొంతు శ్రీదేవి, పట్నం సునీతా

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: లోక్​సభ అభ్యర్థుల ఎంపికను టీపీసీసీ దాదాపు పూర్తిచేసింది. ఇటీవల కాంగ్రెస్​పార్టీలో చేరిన జీహెచ్​ఎంసీ మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ సతీమణి బొంతు శ్రీదేవి, అలాగే వికారాబాద్​ జిల్లా పరిషత్​ చైర్​పర్సన్​ మాజీ మంత్రి పట్నం మహేందర్​రెడ్డి సతీమణి పట్నం సునీతా జాక్​పాట్​ కొట్టేశారు. బొంతు శ్రీదేవికి సికింద్రాబాద్​ లోక్​సభ అభ్యర్థిగా, చేవేళ్ల లోక్​సభ అభ్యర్థిగా పట్నం సునీతాకు ఖరారు అయినట్లు సమాచారం. అలాగే నాగర్​కర్నూల్​ లోక్​సభ అభ్యర్థిగా మల్లురవి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలిసింది. అయితే ఈ సీటుకు పోటీ పడుతున్న మాజీ ఎమ్మెల్యే సంపత్​కుమార్​కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మెదక్​సీటును నీలం మధు ముదిరాజ్​కు ,నిజామాబాద్​ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్​రెడ్డికి, కరీంనగర్, వరంగల్​, పెద్దపల్లి అభ్యర్థులను సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. మల్కాజిగిరి మైనంపల్లి హన్మంతరావు లేకుంటే మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశం ఉంది. అయితే ఖమ్మం, భువనగిరి, నల్గొండ లోక్​సభ సీటుకు సీనియర్​ నేతలు, వారి కుటుంబీకులు పోటీ పడుతుండడంతో ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్​ ఆగ్రనేతలకు (ఆధిష్టానం)కు అప్పగించినట్లు సమాచారం.

నేనే ఉంటా.. సీఎం నాకే చెప్పారు..

నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున ఎంపీగా పోటీపై మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ నుంచి పోటీలో మల్లు రవి ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. ‘‘టికెట్ నాకే ఇస్తానని సీఎం స్పష్టంగా చెప్పారు. నాగర్ కర్నూల్ టికెట్ నాకే ఇస్తారని నమ్మకంగా ఉన్నాను. సర్వేలన్నింటిలో నేనే ముందున్నాను’’ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ – బీఎస్పీ మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. హిందూ మత మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. బీజేపీ హిందూ మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ అవగాహనతో పని చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో లాగా తమ ప్రభుత్వంలో పాలాభిషేకాలు లేవన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతామనే పారిపోతున్నారని మల్లు రవిం ఎద్దేవా చేశారు.

Spread the love