ప్రతిపక్షం, జూన్ 01: ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం గుజరాత్ జట్టు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్టేడియం నుంచి హోటల్కు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది.
ప్రమాదాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని సురక్షితంగా బస్సు నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఆటగాళ్లు దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనతో ఆటగాళ్లు, జట్టు యాజమాన్యం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.




















